వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.
ఏడు కొండలపై కొలువుదీరిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలి అంటే ఎంతటి వ్యవప్రయాసలు.! కొండంత దైవాన్ని కనులారా తిలకించ లేక దూరమయి క్షోభించినవారు ఎందరో…
అలాంటి భక్తుల ఆర్తిని తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) విశాఖ సాగరతీరంలో కలియుగ దైవాన్ని కొలువు తీర్చాలని నిర్ణయించింది. ఆ మేరకు రుషికొండ ప్రాంతంలో కొండ శిఖరంపై ఆలయ నిర్మాణ పనులు చేపట్టి దాదాపు పూర్తి చేసుకుంది.
రుషికొండ గీతం యూనివర్సిటీ, గాయత్రి కళాశాల మధ్యనున్న కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 28 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
ప్రస్తుతం బీచ్ రోడ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ప్రధాన రహదారి, ఆరంభంలో ఆలయ ముఖద్వారం, అర్చకుల వసతి గదులు తదుతరులు ఉన్నాయి.
పై భాగంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువు తీరి గర్భగుడి తో పాటు ఇరువైపులా వివిధ దేవతామూర్తుల ఆలయాలు నిర్మించారు. పై అంతస్తు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా ఆలయానికి ముందు నుంచి మెట్ల సౌకర్యం కల్పించారు.
పెళ్లిళ్ల కోసం 100 నుంచి 150 మందికి సరిపడే కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం కోసం టిటిడి 28 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది.