నవ గ్రహాల్లో శని అతి ముఖ్యమైన గ్రహం. అంతేకాదు సూర్య భగవానుడు, ఛాయాదేవి పుత్రుడు శనీశ్వరుడని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి శని కర్మఫలదాత. వ్యక్తుల వారివారి కర్మలకు ఆయన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. శనిదేవుని మనసారా పూజిస్తే కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి. ఇక వ్యక్తుల తమ జాతకంలో కళ్యాణ, కాలసర్ప, వాస్తు దోషాలు, నవగ్రహ దోషాల పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక, గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శనిదోషం ఉన్నవారు కష్టాలతో బాధపడుతుంటారు. జాతకంలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రలను శని సంబంధ నక్షత్రాలుగా పేర్కొంటారు.
ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు ఉంటాయి. అయితే, వారి వారి జన్మ లగ్నాలను బట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శని ప్రభావం చూపుతారు. అయితే వీటికి పరిహారం చేసుకుని, క్రమ శిక్షణతో జీవనాన్ని గడిపి, ఎదుటివారిని దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు. మనిషికి అనుకోని చికాకులు, ఇబ్బందులు, ఒత్తిడికీ శని కారణమవుతాయి. అనారోగ్యం, చేపట్టిన పనులు అకారణంగా వాయిదా పడటం, మానసిక అశాంతి అన్నీ శని ప్రభావమే.
నిజానికి శనీశ్వరుడు భక్తులకు కోరిన కోరికలను తీర్చే దేవుడు మాత్రమే కాకుండా మనం చేసిన తప్పులకు శని ప్రభావం మనపై చూపెడుతూ అనేక కష్టాలకు గురి చేస్తుంటాడు. అయితే మన పై ఏర్పడిన శని ప్రభావం తొలిగిపోవడానికి శనీశ్వరాలయాన్ని సందర్శించి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు.
ఈ విధంగా శనీశ్వరుడి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పావగడలో వెలిసిన శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది.
పావగడలో వెలసిన శనీశ్వరుని ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు వందల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందని వారి పై ఏర్పడిన శని ప్రభావం తొలిగిపోయి పనులు, కార్యక్రమాలు నెరవేరతాయని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే ఈ ఆలయాన్ని దర్శనం కోసం కర్ణాటక వాసులే కాకుండా అనంతపురం జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున పావగడ శనీశ్వరుని ఆలయానికి చేరుకుంటారు.
పూర్వం ఈ ఆలయంలో శనీశ్వరుని విగ్రహానికి బదులుగా అమ్మవారి విగ్రహం కొలువై ఉండి భక్తులకు దర్శనమిచ్చేది.
ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి పూజలు చేయటం వల్ల ఆ ప్రాంతం ఏ విధమైనటువంటి కరువుకాటకాలు లేకుండా సుభిక్షంగా ఉందని భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించేవారు. అయితే కొన్ని సంవత్సరాల అనంతరం అమ్మవారి పక్కన శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించిన ప్రజలు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు.
అప్పటివరకు అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం రానురాను శనీశ్వరుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఎవరిపై అయితే శని ప్రభావం అధికంగా ఉంటుందో అలాంటి భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించడం.
నిలువుదోపిడి ఇవ్వడం వంటివి చేసి వారి పై ఉన్నటువంటి శని ప్రభావం దోషం తొలగిపోవాలని స్వామి వారికి నమస్కరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.