మన దేశంలో విష్ణుదేవాలయాలు కోకొల్లలు. అయితే ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా ఉన్నాయి. భారతీయ సంస్కృతికి చిహ్నంగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని `అంగ్కోర్ వాట్ దేవాలయం. కంబోడియాలోని సీమ్ రీప్ అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అంగ్కోర్ వాట్ దేవాలయం.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ‘వైష్ణవాలయం.’ మన సంస్కృతికి ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం ఒకవైపు గర్వాంగా ఉన్నా, ఆ ఆలయం అక్కడ ఎందుకు ఉంది అనే సందేహం ఉత్పన్నం అవుతుంది. మన భారతదేశంలో లేకుండా అది ‘కాంభోజ దేశం’లో ఉండడానికి కారణం, ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం ‘కంపూచియా’) లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ నిర్మించారు. ఇది ‘వైష్ణవాలయం’. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో ‘కాంభోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు.
యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన ‘కాము’తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సాంప్రదాయాలుగా వెలుగొందాయి.
జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాట్ దేవాలయం ఒకటి.ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది.
ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయం మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది.
టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది.