భారత దేశం అనేక మతాల సమ్మేళనం. ఇక్కడ చాలా మతాలు ఆదరించబడ్డాయి. అందులో ఒకటి జైన మతం. జైన మతం సాంప్రదాయికంగా జైన ధర్మ అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టింది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
జైన సన్యాసులు పాటించే ముహపట్టి ఆచారం ప్రత్యేకమైనది . జైన మతానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ తెల్లని వస్త్రంతో తయారుచేసిన ముహపట్టి ధరించే ఉంటారు. వారు ఎందుకు అలా ధరిస్తారు.దాని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం…
జైనులు అహింస ధర్మాన్ని పాటిస్తారు. ఇక ఆ మతానికి చెందిన సన్యాసులు అయితే దీన్ని కొంచెం ఎక్కువగానే పాటిస్తారని చెప్పవచ్చు. దానికి ఉదాహరణ ముహపట్టి ధరించడమే. అయితే సాధారణంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు నోట్లోకి కూడా కొన్ని క్రిములు వెళతాయి.
కానీ అవి అక్కడ ఉండలేవు. చనిపోతాయి.
ఇలా క్రిములు చనిపోవడం అంటే హింస చేసినట్టే కదా. ఇది వారి ధర్మానికి విరుద్ధం. కాబట్టే అలా జరగకుండా ఉండేందుకు గాను జైన సన్యాసులు నోటికి ముహ పట్టి ధరిస్తారు.
దీంతో నోట్లోకి క్రిములు వెళ్లవు. అవి చనిపోవు. అయితే జైన మతంలో సన్యాసులే కాదు, కొందరు సాధారణ పౌరులు కూడా ఇలా చేస్తారు. కానీ వారు నోటికి ముహపట్టి ధరించరు. కాకపోతే వారు మాట్లాడినప్పుడల్లా నోటికి చేయి అడ్డం పెట్టుకుంటారు.
లేదంటే తెల్లని కర్చీఫ్ను అడ్డు పెట్టుకుంటారు. ఇలా చేసినా వారి ఆచారం పాటించినట్టే అవుతుందట.
కానీ సన్యాసులు మాత్రం ఇక నిరంతరంగా అలా ముహపట్టీ ధరించే ఉంటారు. అదండీ వారి ముహపట్టి వెనుక అసలు కారణం.