సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఈ ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నం లో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఇంతటి విశేషం గల ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దీనికి మోపిని పురమని సర్పక్షేత్రమని పేరు. కాలక్రమేణా అది మోపిదేవిగా నామాంతరం చెందింది. ఈ ఆలయంలోని గర్భగుడిలో పాము చుట్టలమీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం, స్వామివారికి వేరే పానమట్టం ఉండదు.
ఇచట లింగం వృత్తాకారంలో కాకా పలకగా ఉండుట ఒక విశేషం. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయంలో గర్భగృహం నందు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికీ ఎదురుగా కుడివైపున పట్టపుజా నాగేశ్వరుడు దర్శనమిచ్చును.
ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం అగస్త్య మహర్షి ఉత్తర కాశీలో తపస్సు సాగిస్తుండగా, వింధ్యపర్వతం గర్వంతో ఎత్తు ఎదిగి పోయి సూర్యమండలాన్ని దాటిపోయింది. దానితో సూర్యగతి ఆగిపోయి ప్రకృతి స్థంబించింది. ప్రమాదాన్ని గ్రహించి బ్రహ్మాదిదేవతలు కాశీనగరానికి వచ్చి అగస్త్యుడని ప్రార్ధించి ఈ ప్రమాదాన్ని తప్పించమని ప్రాధేయపడగా, అలా కాశి నుండి బయలుదేరిన అగస్త్యుడు కృష్ణానది తీరాన్ని సమీపించి మోపిదేవి ప్రాంతానికి వచ్చాడు.
ఇక్కడి ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించగా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అయన నిర్ణయించుకున్నాడు. ఒకరోజు మహర్షికి ఆ ప్రదేశంలో ఉన్న ఒక పుట్టలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దాగి ఉన్నట్లు అంతర్వాణి తెలియచేయగా, అతడికి అక్కడ దగ్గరలోని ఒక పుట్ట రంద్రంలో వెలుగు కనిపించింది. అప్పుడు తన శిష్యుల సహాయంతో అక్కడ తవ్వించగా తళతళ మెరుస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కనిపించాడట. అప్పుడు ఆ మహర్షి స్వామికి అక్కడ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం.
ఈ ఆలయంలోని స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని, మ్రొక్కిన మ్రొక్కులు నెరవేర్చే మహత్యం కలదని భక్తుల విశ్వాసం. ఇలా వెలసిన ఈ స్వామివారి ఆలయానికి నాగులచవితి, సుబ్రమణ్య షష్టి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.